Tamil Nadu: ఒకే దేశం-ఒకే ఎన్నికలు – వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒకే దేశం – ఒకే ఎన్నికలు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవద్దని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రవేశపెట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనదే కాకుండా అసాధ్యమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై రాజ్యాంగంలోనూ ప్రస్తావన లేదని చెప్పారు. భారతదేశం వంటి విశాలమైన, వైవిధ్యమైన దేశంలో కేంద్రానికి, రాష్ట్రానికి వేరు వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఒకే దేశం – ఒకే ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు విరుద్ధం అని తీర్మానంలో జోడించారు.

దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఒన్ నేషన్ – ఒన్ ఎలక్షన్‌కు ఎప్పటి నుంచో కేంద్రం మద్దతు తెలుపుతోంది. జమిలీ ఎన్నికలకు లా కమిషన్ సిఫారసులు కూడా చేసింది. జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఒకేసారి దేశవ్యాప్తంగా అటు పార్లమెంట్ కు, ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రతిపక్ష నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు అధికరణలను సవరించాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ రాజ్యసభలో వెల్లడించారు. ఈ పరిస్థితుల నడుమ ఒకే దేశం-ఒకే ఎన్నికలు విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేయడం గమనార్హం.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours